చండీగఢ్: హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ జీపు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 14 మందితో కూడిన బృందం పంజాబ్లోని ఫజిల్కాలో జరిగిన వివాహానికి హాజరై క్రూజర్లో తమ స్వస్థలాలకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో ఫతేహాబాద్లోని భాఖడా కాలువ దాటుతుండగా అదుపుతప్పిన జీపు బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడిపోయింది. దీంతో 9 మంది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతవగా, ఇద్దరు సజీవంగా ఉన్నారని జిల్లా సబ్కలెక్టర్ జగదీశ్ చంద్ర చెప్పారు.
గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారితోపాటు పదేండ్ల బాలిక, ఓ మహిళ ఉన్నారని వెల్లడించారు. కాలువలో నీటి ప్రవాహం తక్కువైతే గాలింపు సులభమవుతుందని, దీనికోసం నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించామన్నారు.