చండీగఢ్: మరణించిన వృద్ధురాలి అంత్యక్రియలకు హాజరైన 28 మంది ట్రాక్టర్ ట్రాలీలో తిరుగు ప్రయాణమయ్యారు. ఒక లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. (truck collides with trailer) పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జలాలాబాద్కు చెందిన ఒక వృద్ధురాలు మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో సహా సుమారు 28 మంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ట్రాక్టర్ ట్రాలీలో తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, బుధవారం తెల్లవారుజామున ఫిరోజ్పూర్-ఫాజిల్కా రహదారిపై ఆ ట్రాక్టర్ ట్రాలీని ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. చికిత్స పొందుతూ మరో ఐదుగురు చనిపోయారు.
మరోవైపు గాయపడిన మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన చికిత్స కోసం ఫరీద్కోట్లోని ప్రత్యేక వైద్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.