ముంబై : నాలుగు పదుల వయసు దాటగానే పరుగు పందెం అటుంచి కొద్ది దూరం వాకింగ్ అంటేనే చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. అయతే 80 ఏండ్ల వయసులో ఓ మహిళ శారీ, షూస్ ధరించి ఏకంగా ముంబై మారథాన్లో పరుగుపెట్టారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్లో 55,000 మందికి పైగా పాల్గొనగా బామ్మ పార్టిసిపేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ సాగింది.
మారథాన్లో బామ్మ చలాకీగా పాలుపంచుకోవడం అందరిలో స్ఫూర్తి నింపింది. ఆమె మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ బామ్మ మారథాన్లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో 80 ఏండ్ల భారతి ఇతర పార్టిసిపెంట్స్తో కలిసి ఎంతో చురుకుగా నడవడం, పరుగెత్తడం కనిపిస్తుంది. బామ్మ శారీ, షూస్తో త్రివర్ణ పతాకం చేబూని మారథాన్లో పాల్గొన్నారు. ఈ ఆదివారం టాటా మారథాన్లో దృఢచిత్తం, అంకితభావంతో 80 ఏండ్ల నానమ్మ పాలుపంచుకోవడం స్ఫూర్తి రగలించిందని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
మారథాన్లో నానమ్మ పాల్గొనడం ఇది ఐదవసారని డింపుల్ చెప్పుకొచ్చారు. మారథాన్ కోసం తాను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేశానని వృద్ధురాలు తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు యువతరానికి బామ్మ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె పరిగెత్తడం చూసి సంతోషంగా ఉంది..వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని ఓ యూజర్ రాసుకొచ్చారు.