చెన్నై: తోటి పిల్లల ఎగతాళి భరించలేని సుమారు 80 మంది గిరిజన విద్యార్థులు ఏకంగా బడి మానేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యా శాఖాధికారులు షాక్ అయ్యారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మేల ఉల్లూరు గ్రామంలో నారిక్కురువ వర్గానికి చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. వారి పిల్లలు అడవుల్లో నడుస్తూ, కాలువలు దాటుతూ, వన్య మృగాల బారి నుంచి తప్పించుకుని అష్టకష్టాలు పడి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకునేవారు. అయితే ఆ గిరిజన పిల్లల యాస, పద్ధతులను తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఈ నేపథ్యంలో హేళన, మందలింపులు, అవమానాన్ని సహించని సుమారు 80 మంది గిరిజన పిల్లలు ప్రభుత్వ స్కూల్కు వెళ్లడం మానేశారు.
కాగా, స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లల గురించి తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ సిబ్బంది, పోలీసులు, చైల్డ్లైన్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, బ్లాక్ రిసోర్స్ టీచర్ల సహకారంతో తంజావూరు జిల్లా వ్యాప్తంగా ఈ సర్వే చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 1700 మంది విద్యార్థులు స్కూల్ డ్రాప్ అవుట్ అయినట్లు గుర్తించారు. వీరిలో 80 మంది గిరిజన ప్రాథమిక విద్యార్థులు తోటి పిల్లల ఎగతాళిని ఎదుర్కోలేక స్కూల్ మానేసిన సంగతి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ గిరిజన పిల్లల కోసం ఆ గ్రామ పరిసరాల్లో ఒక స్కూల్ నిర్మించాలని ఆ జిల్లా పాలనా యంత్రాంగం నిర్ణయించింది.