అగర్తలా: రాష్ట్రంలోని అర్హులైనవారిలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసైనా ఇచ్చామని త్రిపుర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. రాష్ట్రంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లలో ప్రతి ఒక్కరికి మొదటి డోసు ఇచ్చామని త్రిపుర నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ సిద్ధార్థ శివ్ జైస్వాల్ తెలిపారు. అదేవిధంగా 45 ఏండ్ల పైబడినవారిలో 98 శాతం మందికి టీకా పంపిణీ చేశామన్నారు. ఇలా రాష్ట్ర జనాభాలో అర్హులైనవారిలో కనీసం 80 శాతం మందికి కనీసం ఒక్క డోసైనా వేశామని ప్రకటించారు. ఇప్పటి వరకు 18 లక్షల 31 వేల మందికి వ్యాక్సినేషన్ ముగిసిందన్నారు.
త్రిపురలో 18-44 ఏండ్ల వారికి మే 13 నుంచి, ఆరోగ్య కార్యకర్తలకు జనవరి 16, ఫ్రంట్లైన్ వర్కర్లకు ఫిబ్రవరి 5 నుంచి టీకాలు వేస్తున్నారు. మొత్తం ఆరోగ్య కార్యకర్తల్లో 73 శాతం మందికి, 56 శాతం ఫ్రంట్లైన్ వర్కర్లకు రెండు డోసులు ఇచ్చామని తెలిపారు.