న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న క్రమంలో..ఆర్టీఐ సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కేంద్రంలో మంజూరైన ఉద్యోగాల్లో 8,23,656 లక్షలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇందులో పబ్లిక్సెక్టార్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ లేవు. ఆర్టీఐలో వెల్లడైన వివరాల ప్రకారం మొత్తం మంజూరైన 39,23,212 పోస్టులకు గాను 2024 మార్చి 31 నాటికి 30,99,556 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మొత్తం మంజూరైన పోస్టుల్లో ఇంకా 21 శాతం ఖాళీగానే ఉన్నాయి. కొన్ని కీలక విభాగాలు పోస్టులు మంజూరైనా వాటిని భర్తీ చేయట్లేదు.
సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ శాఖలోనే ఎక్కువ ఖాళీలు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఈ శాఖలో 5,56,248 ఉద్యోగాలు మంజూరు కాగా 2,42,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత రైల్వేశాఖలో 2,40,125 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిపై చంద్రశేఖర్ గౌర్ మాట్లాడుతూ.. ఉద్యోగం యువత హక్కు అని.. ఖాళీలను మిషన్ మోడ్లో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దాని వల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ పనితీరు సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు.
