బెంగళూరు: కర్ణాటకలో నాలుగేళ్ల కిందట బీజేపీకి మద్దతిచ్చి ఆ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన 8 మంది కాంగ్రెస్ రెబల్స్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన సుమారు 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. బీజేపీకి మద్దతివ్వడంతో హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్), కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. 16 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అనంతరం వారంతా బీజేపీలో చేరారు. అదే ఏడాది ఉప ఎన్నికలు నిర్వహించగా బీజేపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రులయ్యారు.
కాగా, మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగుబాటు నేతలు బీజేపీ తరుఫున పోటీ చేశారు. అయితే శనివారం వెల్లడైన ఫలితాల్లో 8 మంది కాంగ్రెస్ రెబల్ నేతలు ఈసారి ఓడిపోయారు. బీజేపీ మంత్రులైన వీరు కాంగ్రెస్ అభ్యర్థుల చేతుల్లో పరాజయాన్ని చవిచూశారు. మాస్కీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బసనగౌడ తుర్విహాల్పై ప్రతాప్గౌడ పాటిల్ 13,053 ఓట్లతో ఓడిపోయారు. హీరేకెకూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఉజనేశ్వర్ బసవన్నప్ప బణకార్పై 15,020 ఓట్ల తేడాతో బీసీ పాటిల్ పరాజయం పొందారు.
అలాగే ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ (చిక్కబళ్లాపుర) కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్పై 10,642 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎంటీబీ నాగరాజ్ (హోస్కోట్) కాంగ్రెస్ అభ్యర్థి శరత్ కుమార్ బచ్చెగౌడపై 5,150 ఓట్ల తేడాతో, శ్రీమంత్ పాటిల్ (కాగ్వాడ్) కాంగ్రెస్ అభ్యర్థి బలరామగౌడ అలగౌడ చేతిలో 8,827 ఓట్ల తేడాతో పరాజయం పొందారు.
మరోవైపు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన లక్ష్మణ్ సవాడి చేతిలో మహేశ్ కుమతల్లి (అథని) 76,122 సీట్లతో ఓడిపోయారు. కేసీ నారాయణ గౌడ్ (కేఆర్ పేట్), ఆర్ శంకర్ (రాణిబెన్నూరు) కూడా పరాజయం పాలయ్యారు. విజయనగర స్థానంలో మంత్రి తండ్రి ఆనంద్ సింగ్ బదులు బీజేపీ పోటీకి దింపిన సిద్దార్థ్ సింగ్ 33,723 ఓట్ల తేడాతో హెచ్ఆర్ గవియప్ప చేతిలో ఓడిపోయారు.
కాగా, 2019లో బీజేపీలో చేరిన మిగతా కాంగ్రెస్ రెబల్ నేతలు శివరామ్ హెబ్బార్ (ఎల్లాపూర్), ఎస్టి సోమశేఖర్ (యశ్వంత్పూర్), బైరతి బసవరాజ్ (కెఆర్ పురం), ఎన్ మునిరత్న (ఆర్ఆర్ నగర్), రమేష్ జార్కిహోళి (గోకాక్), కె గోపాలయ్య (మహాలక్ష్మి లేఅవుట్) ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే రోషన్ బేగ్, ఏహెచ్ విశ్వనాథ్కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఈసారి ఎన్నికల్లో వారు పోటీ చేయలేదు.