న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అధికార నివాసంపై దాడికేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్ పండిట్లను కేజ్రీవాల్ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార నివాసం గేటును ధ్వంసం చేశారు. మరో గేటుపై కాషాయ రంగు చల్లారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ బారికేడ్లను దాటుకొని ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ వ్యవహారంపై సిట్ వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దర్యాప్తు స్వతంత్రంగా జరిగేలా చూడాలని, నిర్ణీత కాలవ్యవధిలోపు విచారణ ముగిసేలా ఆదేశించాలని కోరారు.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన విషయం తెలిసిందే. సినిమాలో పండిట్లను తరిమేసినట్లు, ఊచకోత కోసినట్లు చూపించడం అబద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే ఈ చిత్రానికి బీజేపీ చేస్తున్న ప్రచారంపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు.