న్యూఢిల్లీ, అక్టోబర్ 6: అర్హులైన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. రైల్వే ఉద్యోగులకు బోనస్తో పాటు పలు అంశాలపై మంత్రివర్గం చర్చించింది. బోనస్ వల్ల 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి కలుగుతుందని, ప్రభుత్వ ఖజానాపై రూ.1,985 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అపరెల్ (పీఎం మిత్ర) పార్కుల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని వచ్చే ఐదేండ్లలో రూ.4,445 కోట్లతో నెలకొల్పుతారు. వీటి వల్ల ప్రత్యక్షంగా 7 లక్షలు, పరోక్షంగా 14 లక్షలు ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వీటి ఏర్పాటుకు ఇప్పటికే 10 రాష్ర్టాలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి చెందిన ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో పీఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తారు.
ఏమిటీ పీఎం మిత్ర పార్కులు?
పీఎం మిత్ర పార్కుల గురించి 2021-22 బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ఒకేచోట వెయ్యి ఎకరాలకు పైగా భూమి, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్న రాష్ర్టాలను స్వాగతిస్తున్నట్టు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్ ఆసక్తి కనబరిచాయి. పార్కు ఏర్పాటుకు స్థలాన్ని ‘స్విస్ చాలెంజ్ పద్ధతి’లో ఎంపిక చేస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. గ్రీన్ఫీల్డ్ భూముల్లో ఏర్పాటుచేసే పార్కుకు పెట్టుబడి కింద గరిష్ఠంగా రూ.500 కోట్లు, బ్రౌన్ఫీల్డ్ భూముల్లో రూ.200 కోట్లు కేంద్రం ఇస్తుంది. కాంపిటీటివ్నెస్ ఇన్సెన్టివ్ కింద మరో రూ.300 కోట్లు అందజేస్తుంది.