న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు కాలేజీ జరిగే సమయంలో ప్రైవేటు క్లినిక్లు, దవాఖానల్లో ఉండటంపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిషేధం విధించింది. మెడికల్ కళాశాలల్లో అధ్యాపకులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ‘పీజీ కోర్సులకు కనీస ప్రమాణాల అవసరాలు (పీజీఎంఎస్ఆర్)-2023’ పేరుతో తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
దీని ద్వారా మెడికల్ కాలేజీల్లో ‘ఘోస్ట్ ఫ్యాకల్టీ’ సమస్యకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. కాలేజీ కార్యకలాపాలు జరిగే సమయంలో అధ్యాపకులు పూర్తి సమయం అక్కడే ఉండాలని, ఎలాంటి ప్రైవేటు ప్రాక్టీస్ చేయకూడదని మార్గదర్శకాల్లో ఎన్ఎంసీ స్పష్టం చేసింది.