(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశంలో కొత్త కంపెనీలను పెట్టాలంటూ ‘స్టార్టప్ ఇండియా’ పేరిట ఊదరగొట్టిన బీజేపీ సర్కారు.. ఆ తర్వాత ఆ సంస్థల బాగోగులను పట్టించుకోవట్లేదు. స్టార్టప్ కంపెనీల పురోగతికి అనుకూలమైన విధానాలను అమలు చేస్తామంటూ కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలేనని తేలింది.
జనవరి-జూన్ మధ్య కాలంలో దేశంలోని దాదాపు 70 స్టార్టప్ కంపెనీలు.. 17 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు రిక్రూట్మెంట్ సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ తాజా నివేదికలో పేర్కొంది. నిధుల కొరతే ఉద్యోగ కోతలకు కారణమని తెలిపింది. కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవడమే ఈ కోతలకు ప్రధాన కారణమని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.