లక్నో: తండ్రి గెలుపు కోసం ఏడేండ్ల బాలిక ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. తేజ్ నారాయణ్ పాండే అనే వ్యక్తి సమాజ్వాదీ పార్టీ నుంచి అయోధ్య టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడేండ్ల ఆయన కుమార్తె గౌరీ పాండే, తండ్రికి మద్దతుగా ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మూడో తరగతి చదివే ఆమె ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంటింటికి వెళ్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రికి ఓటు వేయాలని కోరుతున్నది. రెండు గంటల ప్రచారం తర్వాత ఆమె స్కూలుకు వెళ్తుంది. స్కూల్ ముగిసిన తర్వాత సాయంత్రం మరో రెండు గంటలపాటు తండ్రి తరుఫున ప్రచారం చేస్తున్నది. ‘అఖిలేష్ యాదవ్ సీఎం కావడం కోసం మా నాన్నకు ఓట్లు వేయాలని స్థానికులను అభ్యర్థిస్తున్నాను’ అని గౌరీ పేర్కొంది. కాగా, ఆ బాలిక వెంట ఆమె తల్లితోపాటు మరికొందరు మహిళలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
మరోవైపు సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ విద్యార్థి నాయకుడు పవన్ పాండే, అయోధ్య నుంచి మూడోసారి పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ఆయన ఎన్నికల అరంగేట్రం చేశారు. ప్రస్తుతం ఫైజాబాద్ ఎంపీగా ఉన్న బీజేపీ ప్రముఖ నేత లల్లూ సింగ్ను ఓడించారు.