లక్నో: ఏడేండ్ల బాలికపై ఒక చిరుత పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని బారాహి శ్రేణికి సమీపంలో ఉన్న మజారా గ్రామంలో శుక్రవారం ఏడేండ్ల మన్ ప్రీత్ ఇంటి బయట ఆడుకుంటున్నది. ఇంతలో అక్కడకు వచ్చిన ఒక చిరుత ఆ బాలికపై దాడి చేసింది. బాలిక భయంతో కేకలు వేయగా ఇంట్లో ఉన్న ఆమె తల్లిదండ్రులు పరుగున బయటకు వచ్చారు. చిరుత గుప్పిట్లో ఉన్న తమ కుమార్తెను చూసి వారు భయాందోళన చెందారు. మరోవైపు చుట్టుపక్కల వారు కూడా బాలిక అరుపులు విని కర్రలతో అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ చిరుత అక్కడి నుంచి పారిపోయింది.
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన మన్ ప్రీత్ను తొలుత పురన్పూర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం బరేలీ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో ఆమెను బరేలీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, బాలికకు బాగా రక్తం పోవడంతో పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ ప్రాంతంలో చిరుత పులి దాడి చేయడం ఇదే తొలిసారి అని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారి నవీన్ ఖండేల్వాల్ తెలిపారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.