కర్ణాటకలో అబార్షన్ చేసి పడేసిన వైనం
బెళగావి, జూన్ 25: అక్రమంగా గర్భస్రావం చేయడం చట్టరీత్యా నేరం. ఈ విషయం తెలిసినా కూడా కొందరు డాక్టర్లు కాసులకు కక్కుర్తి పడి అక్రమంగా పిండాలను చిదిమేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ అమానవీయ ఘటన జరిగింది. ముదలాగీ పట్టణంలోని ఓ బ్రిడ్జి కింద కాలువలో ఏడు పిండాలు దొరికాయి.
ఐదు బాటిళ్లలో ఈ పిండాలను అక్కడ పడేసినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అబార్షన్లపై జిల్లా వైద్య విభాగం విచారణకు ఆదేశించింది. లింగ నిర్ధారణ జరిపిన తర్వాత గర్భస్రావం చేసి ఉండొచ్చని బెళగావి జిల్లా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మహేశ్ కోని అనుమానం వ్యక్తం చేశారు. పిండాలకు ఐదు నుంచి 7 నెలల వయసు ఉంటుందని చెప్పారు.