పుణె, జూలై 19: ఛార్జింగ్ పెట్టిన సమయంలో రేగిన అగ్నిప్రమాదంలో ఏడు ఎలక్ట్రిక్ బైక్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో పుణెలోని ఓ బైక్ షోరూంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టిన కారణంగా షార్ట్సర్క్యూట్ చోటుచేసుకొని ఉంటుందని, తద్వారా మంటలు రేగాయని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఓ అగ్నిమాపక దళ అధికారి పేర్కొన్నారు. అయితే పూర్తి దర్యాప్తులో ఘటనకు కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో కూడా పుణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు రేగిన విషయం తెలిసిందే.