ఇంఫాల్ : మణిపూర్లోని నోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తుపుల్ యార్డ్ రైల్వే కన్స్ట్రక్షన్ క్యాంపుపై బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జవాన్లు ఉన్నట్లు సమాచారం. రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ సైట్ వద్ద కాపలాగా జవాన్లు ఉన్నారు. కొండచరియల కింద 50 మందికి పైగా స్థానికులు, సైనికులు చిక్కుకున్నారు. శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే కొండచరియలు విరిగిపడటంతో.. అక్కడున్న నది ప్రవాహం ఆగిపోయింది. దీంతో నోని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది వద్దకు పిల్లలను వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ప్రమాద ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తుపుల్లో ఇవాళ జరిగిన ప్రమాద ఘటనపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు బీరెన్ సింగ్ ప్రకటించారు. సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయని తెలిపారు. ఘటనాస్థలికి అంబులెన్స్లతో పాటు వైద్యులను పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు.