శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కార్గిల్లో ఘోర ప్రమాదం రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు జామున జోజిలా పాస్ వద్ద వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. శ్రీనగర్-లేహ్ హైవేపై కార్గిల్ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న తవేరా వాహనం జోజిలా పాస్ వద్ద 400-500 అడుగుల లోతులో పడిపోయిందని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. నలుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్ర గాయాలకు గురై మరణించారని పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి తీవ్ర గాయాలకు గురవగా.. ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న సోనామార్గ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ వ్యక్తిని స్కిమ్స్ సౌరాకు తరలించారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ సోనామార్గ్ యూనిస్ బషీర్ ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.