(స్పెషల్ టాస్క్ బ్యూరో)
Supreme court | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) హరీశ్ హస్ముఖ్ భాయ్ వర్మకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు జిల్లా జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై స్టే విధించింది. ఈ చర్య చట్టవిరుద్ధమైనదిగా కోర్టు అభివర్ణించింది. ప్రభుత్వ చర్యను తప్పుబట్టిన న్యాయస్థానం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే హరీశ్తో పాటు మరో 67 మంది గుజరాత్ న్యాయాధికారులకు కల్పించిన పదోన్నతి ఉత్తర్వులపై కూడా న్యాయస్థానం స్టే విధించింది. పదోన్నతి రాకముందు ఏయే స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నారో.. ఆయా స్థానాలకు వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్లు ఎంఆర్ షా, సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.
కేసు విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘న్యాయాధికారుల పదోన్నతికి సంబంధించిన పిటిషన్.. మా వద్ద ఉండగానే, దానిపై మేము నోటీసులు జారీ చేసిన సమయంలోనే గుజరాత్ ప్రభుత్వం పదోన్నతికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది దురదృష్టకరం. అధికారుల పదోన్నతిపై హైకోర్టు చేసిన సిఫారసులతో పాటు ప్రభుత్వ నోటిషికేషన్పై కూడా స్టే విధిస్తున్నాం. పదోన్నతి రాకముందు ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వహిస్తున్నారో.. ఆయా స్థానాల్లో విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తున్నాం’ అని జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. ‘రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం, పదోన్నతి అనేది మెరిట్-కవ్ు-సీనియారిటీ సూత్రం ఆధారంగా 65 శాతం రిజర్వేషన్లకు లోబడి, అనుకూలత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారితో జిల్లా జడ్జి పోస్టులను భర్తీ చేయాలి. అయితే, ఇవేమీ పాటించకుండా పదోన్నతులకు సంబంధించి హైకోర్టు సిఫారసు చేయడం, ఆ వెంటనే సర్కారు నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధం’ అని కోర్టు వెల్లడించింది. కోర్టు నోటీసులిచ్చినప్పటికీ, ప్రభుత్వం పదోన్నతి ఉత్తర్వులు జారీ చేయడం కార్యనిర్వాహక వ్యవస్థను వంచించడమే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
2019 నాటి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సీజేఎం హరీశ్ హస్ముఖ్ భాయ్ వర్మ రాహుల్ను దోషిగా తేల్చారు. అనంతరం హరీశ్తో పాటు మరో 67 మంది న్యాయాధికారులకు జిల్లా జడ్జిలుగా పదోన్నతి కల్పించాలంటూ గుజరాత్ హైకోర్టు సిఫారసు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ.. సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ అధికారులు ఇద్దరు సుప్రీంను ఆశ్రయించారు. ‘మెరిట్-కవ్ు-సీనియారిటీ సూత్రాన్ని’ విస్మరించినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టుకు, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులిచ్చింది. అయితే, సుప్రీంలో ఈ కేసు పెండింగ్లో ఉండగానే, న్యాయాధికారులకు పదోన్నతి కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై తాజాగా విచారించిన ధర్మాసనం పదోన్నతులపై స్టే విధించింది.