న్యూఢిల్లీ: దేశంలో గత ఐదేళ్లలో పోలీస్ కస్టడీలో 669 మంది మరణించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు పోలీస్ కస్టడీలో 669 మంది చనిపోయినట్లు పేర్కొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) గణాంకాలను ఆయన వెల్లడించారు. 2021-2022లో పోలీసు కస్టడీలో మొత్తం 175 మరణాలు సంభవించినట్లు తెలిపారు. 2020-2021లో 100, 2019-2021లో 112, 2018-2019లో 136, 2017-2018లో 146 లాకప్ డెత్లు నమోదయ్యాయని చెప్పారు.
కాగా, 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో 201 కేసులకు గాను రూ.5,80,74,998 పరిహారంతోపాటు ఒక కేసులో క్రమశిక్షణా చర్యలను ఎన్హెచ్ఆర్సీ సిఫార్సు చేసిందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. అయితే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం పోలీస్, పబ్లిక్ ఆర్డర్ రాష్ట్ర అంశాలని మంత్రి స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు.
మరోవైపు మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సలహాలు ఇస్తుందని మంత్రి రాయ్ తెలిపారు. దీని కోసం మానవ హక్కుల పరిరక్షణ చట్టం (పీహెచ్ఆర్), 1993ను రూపొందించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆరోపిత మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశీలించేందుకు ఎన్హెచ్ఆర్సీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.