న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశంలో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం ఆదివారం వెల్లడించింది. కరోనా కారణంగా కేరళలో ఒకరు చనిపోయారని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది. అయితే తాజాగా కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరిస్తే బాగుంటుందని సూచించింది.
భయం అక్కర్లేదు: కేంద్రమంత్రి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ స్పందించారు. పౌరులతో పాటు పర్యాటక రంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గతంలో కొవిడ్ను మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.