ఐజ్వాల్ : ఓ భర్త తన భార్యపై కక్ష పెంచుకుని, మానవ బాంబుగా మారి హతమార్చాడు. ఈ సూసైడ్ బాంబ్ అటాక్లో భార్యాభర్తలిద్దరూ మరణించారు. ఈ ఘటన మిజోరంలోని లుంగ్లేయి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 12:15 గంటలకు చోటు చేసుకుంది.
లుంగ్లేయి జిల్లాకు చెందిన రోహ్ మింగ్లైనా(62), ట్లాంగ్థియాన్ఘ్లిమి(61) దంపతులు. ట్లాంగ్థియాన్ఘ్లిమి స్థానిక మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం భార్య వద్దకు వచ్చిన భర్త ప్రేమ వలకబోస్తూ మాట్లాడాడు. అమాంతం ఆమెను అతను కౌగిలించుకున్నాడు. దుస్తుల లోపల జిలెటిన్ స్టిక్స్ చుట్టుకొని వచ్చిన అతడు ట్రిగ్గర్ నొక్కగానే భారీ పేలుడుతో మార్కెట్ దద్ధరిల్లింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగానే ఈ దారుణ ఘటనకు భర్త పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పేలుడు జరిగిన సమయంలో ట్లాంగ్థియాన్ఘ్లిమి కుమార్తె తల్లికి కొద్దిదూరంలోనే ఉంది.