Covid-19 | న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,311కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం పేర్కొంది. కొవిడ్-19 ఉప రకం జేఎన్.1కు సంబంధించి మూడు రాష్ర్టాల్లో 21 కేసులు నమోదయ్యాయి. గోవాలో 19, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఈ ఉప వేరియంట్ వ్యాప్తికి గల కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళలో మూడు మరణాలు నమోదయ్యాయి.
అప్రమత్తంగా ఉండండి.. ఆందోళన వద్దు
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా పూర్తిగా నాశనం కాలేదని, ఇటీవల కాలంలో కొత్త వేరియంట్ వెలుగుచూస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటక రాష్ర్టాల్లో పాజిటివిటీ రేటు పెరిగిందని చెప్పారు. కరోనా వ్యాధి సన్నద్ధత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను ఆయన వివిధ రాష్ర్టాలతో చర్చించారు. కేసుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా అప్రమత్తత అవసరమని ఆయన అన్నారు. కేసులపై నిఘా పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులను తగిన స్థాయిలో నిల్వ ఉంచాలని, ఆక్సిజన్, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన రాష్ర్టాలు, యూటీలకు సూచించారు. పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిటేటర్లు పనితీరును పరిశీలించేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి ఆసుపత్రులలో సన్నద్ధతపై మాక్డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే టెస్టుల సంఖ్యను పెంచాలని, తాజా కేసులు, టెస్టులు, పాజిటివిటీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రంతో పంచుకోవాలని మంత్రి మాండవీయ కోరారు.