ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ఆ ఆస్పత్రిలో 61 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఆస్పత్రి యంత్రాంగం అప్రమత్తమై కరోనా సోకిన వైద్యులను ఐసోలేషన్లో ఉంచింది. ఒక్క జేజే ఆస్పత్రిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా బారినపడుతున్న రెసిడెంట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతున్నదని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ తెలిపింది.
గడిచిన 48 గంటల వ్యవధిలో మహారాష్ట్రవ్యాప్తంగా 170 మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది. వారిలో రాజధాని ముంబైలోనే 120 మంది ఉన్నారు. వారిలో కేవలం జేజే హాస్పిటల్లోనే సగం మంది ఉండటం ఆందోళనకరమైన విషయం. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పటికే రెసిడెంట్ డాక్టర్ల కొరత ఉన్నది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు భారీ సంఖ్యలో రెసిడెంట్ డాక్టర్లు కొవిడ్ మహమ్మారి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.