NFHS Survey | శ్రీనగర్, జూన్ 15: దేశం సాంకేతికతతో పాటు ఇతర రంగాల్లో ముందుకు పోతున్నా.. పలు సామాజిక అంశాల్లో ఇంకా వెనుకబడే ఉన్నది. చాలా మంది మహిళలు రుతుస్రావం సమయంలో రక్షణకు ఇంకా సాధారణ వస్ర్తానే వినియోగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. జమ్ముకశ్మీర్లో వస్ర్తాన్ని వినియోగిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 60 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో కూడా ఇదేవిధమైన పరిస్థితి ఉన్నదని తెలిపింది. పరిశుభ్రతపై అవగాహన లేమి, శానిటరీ ప్యాడ్స్ను కొనుగోలు చేసే స్థోమత లేకపోవడం వంటివి ఇందుకు కారణాలని నిపుణులు చెప్తున్నారు. శుభ్రత లేని వస్ర్తాన్ని మళ్లీ వాడడం వలన ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిస్థితి మెరుగవుతుందని అభిప్రాయపడుతున్నారు. 15-24 ఏండ్ల మధ్య వయసున్న మహిళల్లో 50.5 శాతం మాత్రమే శానిటరీ నాప్కిన్స్ వినియోగిస్తున్నారని ఎన్ఎఫ్హెచ్ఎస్-5(2019-21) సర్వే పేర్కొన్నది.
శానిటరీ ప్యాడ్స్ వినియోగిస్తున్న మహిళలు తక్కువగా ఉన్న రాష్ర్టాల్లో యూపీ (69.4%), అస్సాం(69.1%), మేఘాలయ(65%), మధ్యప్రదేశ్(61%) ఉన్నాయి. వస్ర్తాన్ని వినియోగిస్తున్న మహిళల సంఖ్య తక్కువగా ఉన్న జాబితాలో అండమాన్ అండ్ నికోబార్ 8.2 శాతం, తమిళనాడు 12.7 శాతాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రుతుస్రావం గురించి బయటకు మాట్లాడకూడదనే సామాజిక ఆంక్షలు ఉన్నాయని, అందుకే రుతుస్రావం సమయంలో పరిశుభ్రతపై అవగాహన కొరవడిందని శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ నిసార్ అభిప్రాయపడ్డారు.