తమిళనాడులో చోరీ
చెన్నై, జూన్ 24: బీహార్లో దొంగలు పట్టపగలు బ్రిడ్జిలను ఎత్తుకెళ్లిన వార్తలు విని విస్తుపోయాం.. ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 600 మొబైల్ టవర్లు మాయం కావడం విస్మయం కలిగిస్తున్నది. అసలు ఏం జరిగిందంటే.. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ దేశవ్యాప్తంగా సెల్ఫోన్ టవర్లను ఏర్పాటు చేస్తుంటుంది. ఇప్పటి వరకు 26,000 టవర్లను ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ భారంగా మారడమేకాకుండా కరోనా విజృంభించడం, లాక్డౌన్లు ప్రకటించడంతో సేవలను నిలిపివేసింది. దీంతో ఈ టవర్లను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇది పసిగట్టిన గజదొంగలు టవర్లను దొంగలించడం ప్రారంభించారు. 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 టవర్లను దొంగలించారు. ఒక్కో టవర్ను ఏర్పాటు చేయడానికి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన కోట్లాది రూపాయల సొమ్మును దొంగలు కొల్లగొట్టారు.
ఎలా బయటపడిందంటే..
కరోనా తీవ్రత తగ్గడంతో.. పనిచేయకుండా ఉన్న సెల్ఫోన్ టవర్లను చూసొద్దామని అధికారులు బయలుదేరారు. ఈరోడ్ జిల్లాలోని టవర్ ప్రాంతానికి వెళ్లారు. కానీ వారికి టవర్ కనిపించలేదు. మరో టవర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడా ఇదే అనుభవం. పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు సెల్ఫోన్ టవర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. 600 సెల్ఫోన్ టవర్లను దొంగలు ఎత్తుకెళ్లారని అంచనాకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.