Chamoli Train Accident | ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలీ జిల్లాలోని విష్ణుగడ్–పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో మంగళవారం అర్దరాత్రి రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం కార్మికులు, అధికారులు ప్రయాణిస్తున్న లోకో రైలు, నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న మరో లోకో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది గాయడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లలో కలిపి 109 మంది కార్మికులు, అధికారులు ఉన్నారని చమోలీ జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్ తెలిపారు. వారిలో 60 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. రైళ్లలో ఉండిపోయిన అందర్నీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని వెల్లడించారు. కాగా, తీవ్రంగా గాయపడిన 10 మందిని గోపేశ్వర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి ప్రాజెక్టు పరిధిలోనే ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తామని పేర్కొన్నారు.
చమోలీ జిల్లాలో హెలాంగ్ – పిపల్కోటి మధ్యలో అలకనంద నదిపై జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నాలుగు టర్బైన్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టున్నట్లుగా అధికారులు తెలిపారు.