అహ్మదాబాద్ : ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఆరు నెలల తర్వాత ఇరు కుటుంబాలు వారి విగ్రహాలకు పెండ్లి జరిపించిన ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. తమ కుటుంబ సభ్యులు పెండ్లికి అంగీకరించరని తేలిపోవడంతో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. గత ఏడాది ఆగస్ట్లో తపి ప్రాంతానికి చెందిన గణేష్, రంజన తాడుకు వేలాడుతూ విగతజీవులుగా పడిఉండటాన్ని వారి కుటుంబసభ్యులు గుర్తించారు.
వారు జీవించిఉండగా తాము ఒకే మాటమీద లేకపోవడంతోనే ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారని, తమ కారణంగానే వారు తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారని ఇరు కుటుంబాలు భావించాయి. దీంతో ప్రేమికుల విగ్రహాలను తయారుచేయించిన వారి కుటుంబ పెద్దలు సంప్రదాయబద్ధంగా విగ్రహాలకు వివాహం జరిపించారు.
ప్రేమికులిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టపడినందున వారి విగ్రహాలకు పెండ్లి జరిపించాలని తాము నిర్ణయం తీసుకున్నామని యువతి తాత భీమ్సింగ్ పద్వి తెలిపారు. వారి కోరికను తాము ఇలా మన్నించడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతున్నామని ఇరు కుటుంబాల వారు చెప్పుకొచ్చారు.