బరేలీ: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని సితార్గంజ్కు చెందిన 35 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఉత్తమ్నగర్ గురుద్వారాకు వెళ్తుండగా వెనుక నుంచి ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదేహీ ఏరియాలోని సిర్సా ఔట్ పోస్టు దగ్గర కిచ్చా-కతిమా రహదారిపై ప్రమాదం జరిగింది. మృతులు భజన్ సింగ్ (36), సుమన్ కౌర్ (15), గుర్నామో కౌర్ (30), అకాష్దీప్ (8), రాజా (6), జస్సీ (35)గా అధికారులు గుర్తించారు.
ప్రమాదవార్త తెలిసి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.