Vistara | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు విమాన ప్రయాణంలో ఏవి చేయకూడదో అవే చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి విమానం వాష్రూమ్లో సిగరెట్ తాగి (man smokes on flight) ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన బాలకృష్ణ రాజయన్ అనే 51 ఏళ్ల వ్యక్తి.. సోమవారం నాడు విస్తారా యూకే-234 ఫ్లైట్లో ఒమన్లోని మస్కట్ నుంచి ముంబై (Muscat to Mumbai) వరకూ ప్రయాణించాడు. ఆ సమయంలో అతడు విమానం వాష్రూమ్లో పొగ తాగాడు. స్మోక్ డిటెక్టర్ సాయంతో ఈ విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే క్యాబిన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అలర్ట్ అందుకున్న సిబ్బంది వాష్రూమ్ను తనిఖీ చేయగా.. వాష్ బేసిన్లో సిగరెట్ బడ్ కనిపించింది. ఇక విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mumbai airport)ల్యాండ్ కాగానే.. క్రూ సిబ్బంది ప్రయాణికుడి చర్య గురించి సెక్యూరిటీ సూపర్వైజర్కు వివరించారు.
దీంతో అతడిని పిలిపించి విచారణ చేయగా.. వాష్రూమ్ లోపల పొగతాగినట్లు అంగీకరించాడు. దీంతో అధికారులు ముంబైలోని సహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజయన్ ఉద్దేశపూర్వకంగానే విమానంలో పొగ తాగాడని తెలిపారు. భద్రతా నిబంధనలను ఉల్లంగించి.. విమానంలోని ప్రయాణికులందరినీ ప్రమాదంలో పడేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
Also Read..
Rahul Gandhi | అది మీ వ్యక్తిగత అనుభవమా?.. అంబానీ, అదానీ అంశంలో మోదీకి రాహుల్ కౌంటర్
Kerala Governor | అయోధ్య రాముడి ముందు ప్రణమిల్లిన కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్.. VIDEO