బెంగళూరు: కొత్త ఏడాది తొలి రోజున దైవ దర్శనం కోసం గుడికి వెళ్లి ప్రసాదం తిన్న వారిలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపుర తాలూకా బీరగనహళ్లిలోని గంగమ్మ ఆలయంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ జనవరి 1న వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
కాగా, ప్రసాదం తిన్నవారిలో సుమారు 50 మందికి వాంతులయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రసాదం తిన్న మరి కొందరు ఈ విషయం తెలిసి ఆందోళనతో ఆసుపత్రికి చేరారు. దీంతో ఆ ఆరోగ్య కేంద్రం స్థానికులతో కిక్కిరిపోయింది. అయితే స్వల్ప లక్షణాలున్న వారికి డాక్టర్లు చికిత్స అందించి పంపారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆరోగ్య విభాగం అధికారులు ప్రసాదం శాంపిల్స్ను సేకరించి పరీక్ష కోసం పంపారు. ఆ ప్రాంతంలో తాగు నీటి పరిస్థితిపైనా ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటనపై శ్రీనివాసపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో కొందరు స్థానికులను పోలీసులు ప్రశ్నించారు.