Maha Kumbh Mela | మహాకుంభ్ నగర్, ఫిబ్రవరి 14: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు పుణ్య స్నానాలు చేశారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఏ మతానికి సంబంధించి అయినా ఈ సంఖ్య మానవ చరిత్రలో అతిపెద్ద సామూహిక సమాజ భాగస్వామ్యంగా నిలుస్తుందని తెలిపింది. భారత్, చైనా మినహాయించి ఎక్కువ జనాభా గల 8 దేశాల జనాభా సంఖ్యను కుంభమేళాను దర్శించిన హిందూ యాత్రికుల సంఖ్య దాటేసిందని వెల్లడించింది.
యూఎస్ జనాభా బ్యూరో ప్రకారం చైనా, భారత్ తర్వాత అత్యధిక జనాభా(34.20 కోట్లు) గల మూడో దేశం అమెరికా. యూపీ సర్కార్ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్క రోజే సాయంత్రం 6 గంటల సమయానికి 92 లక్షల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో స్నానమాచరించారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభ మేళా గత నెల 13న ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది.
జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా ఇప్పటి వరకు అత్యధికంగా త్రివేణి సంగమంలో 8 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు మహా కుంభ మేళాకు తరలి వస్తూనే ఉన్నారు.