శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ముష్కరుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు (encounter) జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో జైషే మహమ్మద్ కమాండర్ జహీద్ వాని కూడా ఉన్నాడు.
కశ్మీర్లోని బుద్గాం జిల్లా చరర్ ఐ షరీఫ్ ప్రాంతంలో, పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు 12 గంటలపాటు జరిగిన ఈ ఎన్కౌంటర్లలో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు.
వీరిలో నలుగురు లష్కరే తొయీబా (Let)కు, ఒకరు జైషే మహమ్మద్ (JeM)కు చెందినవారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఒకరు మినహా అంతా పాకిస్థాన్ జాతీయులని చెప్పారు. మరో పాకిస్థానీ ఉగ్రవాది కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఘటనాస్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఏకే-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు.