Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ వద్ద ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను భారత సైన్యం ఉగ్రదాడిగా తేల్చింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవదహనం అయినట్లు సైన్యం వెల్లడించింది. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడని, అతనికి చికిత్స కొనసాగుతోందని తెలిపింది.
ఫూంచ్ పరిధిలోని భీంబర్ గాలి ఏరియాలో గురువారం మధ్యాహ్నాం 3 గంటల సమయంలో రహదారిపై వెళ్తున్న ఆర్మీ ట్రక్కును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడులకు పాల్పడ్డారని, దీంతో ట్రక్కులో మంటలు సంభవించినట్లు సైన్యం నిర్ధారించింది. అయితే అదే సమయంలో భారీ వర్షం కురియడం, తక్కువ విజిబులిటి ఉండటంతో.. ఇదే అదునుగా భావించిన ఉగ్రవాదులు ట్రక్కుపై గ్రనేడ్లతో దాడులు చేసినట్లు సైన్యం భావించింది. భీంబర్ గాలి ఏరియాలో ఉగ్రవాదుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సైనిక ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఐదుగురు జవాన్ల మృతిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని రాజ్నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు.