చెన్నై: పోలీసులపై చేయిచేసుకున్న ఐదుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. విలంకురిచ్చిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. అయితే దీనిపై నిరసన తెలుపుతామని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలు స్కూల్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్కూల్ లోపలే ఉండాలని, బయటకు రావద్దని పోలీసులు సూచించారు. దీనిని లెక్క చేయని కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులు స్కూల్లోకి ప్రవేశిస్తున్నారని ఆరోపిస్తూ చేయిచేసుకున్నారు.
కాగా, ఈ ఘర్షణలో పోలీసులపై చేయి చేసుకున్న ఐదుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను గుర్తించి వారిపై శనివారం కేసు నమోదు చేసినట్లు కోయంబత్తూరు సిటీ నార్త్ డిప్యూటీ కమిషనర్ టీ జయచంద్రన్ తెలిపారు. మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.