భోపాల్ : శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలు ఓ ముస్లిం వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఈ హత్య కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన రాత్రి సమయంలో ఆనంద్ నగర్ – కపాస్ మండీ ఏరియాలో రెండు వర్గాల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి.
ఈ క్రమంలో ఇబ్రీస్ ఖాన్(30) అనే మున్సిపల్ ఉద్యోగిపై దాడులకు పాల్పడి హత్య చేశారు. ఆ మరుసటి రోజు మృతదేహం లభ్యం కాగా, పోలీసులు ఇండోర్కు తరలించారు. ఇబ్రీస్ ఖాన్ హత్యతో ఏడుగురికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయితే ఇబ్రీస్ ఖాన్ను మారణాయుధాలు, రాళ్లతో కొట్టి చంపారని అతని సోదరుడు పేర్కొన్నాడు. ఈ హత్యలో పోలీసుల పాత్ర కూడా ఉందని అతను ఆరోపించాడు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో 63 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.