గువాహటి: అసోంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో ఐదుగురు కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని జిల్లా ఎస్పీ జయంత్ సింగ్ తెలిపారు. గురువారం రాత్రి దియుంగ్బ్రాలో ట్రక్ డ్రైవర్లు, ఇతరులపై ఆయుధాలతో ఐదుగురు మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అనంతరం ఆ ట్రక్కులకు నిప్పంటించారని ఎస్పీ చెప్పారు. ఈ దాడి వెనక డీఎన్ఎల్ఏ అనే మిలిటెంట్ సంస్థ ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అస్సామ్ రైఫిల్స్కు చెందిన భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కాలిపోయిన వాహనాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామన్నారు. ఆ ట్రక్కుల్లో బొగ్గు, ఇతర సామాగ్రిని సమీపంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు.
అసోంలోని కొండ ప్రాంతాల్లో దిమా హసానో జిల్లా ఉన్నది. కొన్నేళ్ల క్రితం తీవ్రవాద కార్యకలాపాలకు నెలవుగా ఉన్నది. అయితే గత ఐదేండ్లుగా అక్కడ స్థబ్దత నెలకొన్నది. కాగా, కర్బీ అన్గ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో డీఎన్ఎల్ఏ ఉగ్రవాదులను భద్రతా బలగాలు తుదముట్టించాయి. దీనికి ప్రతీకారంగానే వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.