లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కలుషిత నీరు కలకలం రేపుతున్నది. ఇప్పటికే ఐదుగురు పిల్లలు మరణించారు. పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. ఖేరీ జిల్లాలోని మహమ్మది పట్టణంలో ఈ సంఘటన జరిగింది. సారయ్య ప్రాంతంలో కలుషిత నీరు తాగడం వల్ల గత వారం ఐదుగురు చిన్నారులు చనిపోయారు. మరో 9 మంది పిల్లలతోపాటు సుమారు 20 మంది స్థానికులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ గుప్తా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. తాగు నీటి నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు.
కాగా, గత వారం రోజుల్లో 14 నెలల వయస్సున్న ఉమ్రా మహమ్మద్, మహ్మద్ అజాన్ అనే నాలుగేళ్ల బాలుడితోపాటు పదేళ్ల కంటే తక్కువ వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు డాక్టర్ గుప్తా తెలిపారు. ఈ పిల్లలు అతిసారం వంటి లక్షణాల వల్ల చనిపోయినట్లు చెప్పారు. ఆరోగ్య అధికారులు ఈ ప్రాంతంలో 472 ఇళ్లను తనిఖీ చేసినట్లు వివరించారు. పిల్లల మరణానికి కలుషిత తాగు నీరు ప్రధాన కారణంగా గుర్తించినట్లు తెలిపారు. తాగు నీటి పైప్ లైన్ లీకేజీ వల్ల మురుగు నీరు కలిసి తాగు నీరు కలుషితమవుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పగిలిన వాటర్ పైప్లైన్ను సరి చేయాలని సంబంధిత డిపార్ట్మెంట్కు సూచించినట్లు వెల్లడించారు.