న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ 20 సమ్మిట్ (G20 Summit) శిఖరాగ్ర సదస్సు జరుగనున్నది. ఈ నేపథ్యంలో భారత్కు వచ్చే పలు దేశాల అధ్యక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ ఉన్న వీఐపీ బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు నడిపేందుకు 450 మంది సీఆర్పీఎఫ్ డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వారంతా క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్లో భాగంగా ఉంటారు. సీఆర్పీఎఫ్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.
కాగా, జీ 20 సదస్సుకు హాజరయ్యే విదేశీ అతిథుల భద్రత కోసం120 వాహనాలను సీఆర్పీఎఫ్కు అందజేశారు. వీటిలో 45 బుల్లెట్ ఫ్రూఫ్ కార్లున్నాయి. వీటిని ప్రత్యేకంగా పలు దేశాల అధ్యక్షుల రక్షణకు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. 120 వాహనాల్లో సుమారు 60 ఎడమ చేతి స్టీరింగ్ కార్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ వాహనాలను పారామిలటరీ దళానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించినట్లు వెల్లడించింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వంటి ఒకరిద్దరు తమ సొంత వాహనాలను తెచ్చుకుంటున్నారని, మిగతా దేశాధ్యక్షులకు బుల్లెట్ ఫ్రూఫ్ లగ్జరీ కార్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. వీఐపీ, వీవీఐపీ వ్యక్తుల తరలింపు కోసం 400 మంది సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. అలాగే సీఆర్పీఎఫ్కు చెందిన డాగ్ స్క్వాడ్లతో కూడిన 48 విధ్వంస నిరోధక బృందాలు అతిథులు బస చేసే హోటళ్లు, వేదికలను తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.