ADR | న్యూఢిల్లీ, మార్చి 29: లోక్సభ సిట్టింగ్ ఎంపీల్లో 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే ఎన్జీవో వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లున్నట్టు ప్రకటించింది. ఒక్కొక్కరి సంపద వందకోట్లకు పైగా ఉన్నదని పేర్కొన్నది. గతంలో ఎంపీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లపై ఏడీఆర్ అధ్యయనం చేసింది. అందులో వివరాలపై నివేదిక విడుదల చేసింది. క్రిమినల్ కేసులు నమోదైన ఎంపీల్లో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులున్నాయి.
28 మందిపై హత్యాయత్నం కేసులుండగా.. వారిలో 21 మంది బీజేపీ ఎంపీలు. ఇక మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు నమోదు కాగా.. వాటిలో 3 అత్యాచారం కేసులున్నాయి. ఇక ఎక్కువ మంది కోటీశ్వరులు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు చెందిన వారే ఉండటం విశేషం. అత్యంత ధనిక ఎంపీల్లో కాంగ్రెస్కు చెందిన నకుల్నాథ్ మొదటిస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్కే చెందిన డీకే సురేశ్, ఇటీవల వైసీపీని వీడిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉన్నారు. యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఎంపీలపైనే ఎక్కువగా క్రిమినల్ కేసులున్నాయి. సగానికిపైగా ఎంపీలపై కేసులున్నాయి. ఇక ఎంపీల విద్యార్హత విషయానికొస్తే 73 శాతం మంది ఎంపీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు తేలింది. మొత్తం 514 ఎంపీ సీట్లలో కేవలం 15 శాతం మాత్రమే మహిళా ఎంపీలుండటం గమనార్హం.