తిరువనంతపురం: తల్లీ, కుమారుడు స్ఫూర్తిగా నిలిచారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో ప్రభుత్వ కొలువులు చేపట్టనున్నారు. కేరళలోని మలప్పురంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. 42 ఏళ్ల బిందు, 24 ఏళ్ల కుమారుడు వివేక్ కలిసి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంట్రన్స్ టెస్ట్కు కోచింగ్ తీసుకుని పరీక్షలు రాశారు. ఈ నెల 3న వెల్లడించిన ఫలితాల్లో వారిద్దరూ ఉత్తీర్ణులయ్యారు. తల్లి బిందు… లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ (ఎల్జీఎస్) పరీక్షలో 92 ర్యాంక్ సాధించగా, కుమారుడు వివేక్… లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్ పొందాడు.
కాగా, తనతోపాటు తన తల్లి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత కావడంపై కుమారుడు వివేక్ హర్షం వ్యక్తం చేశాడు. తన తల్లి ఎంతో కష్టపడిందని తెలిపాడు. అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్న ఆమె కేవలం ఆదివారాల్లో మాత్రమే కోచింగ్ క్లాసులకు హాజరైందని చెప్పాడు. మూడు సార్లు ఉత్తీర్తత కాలేదని, నాలుగో ప్రయత్నంలో విజయం సాధించిందని వెల్లడించాడు.
పరీక్షకు అర్హత పొందిన నాటి నుంచి తాను కూడా తల్లితో కలిసి కోచింగ్ క్లాసులకు వెళ్లినట్లు వివేక్ తెలిపాడు. తండ్రి తమ ఇద్దరినీ ఎంతగానో ప్రోత్సహించారని, కోచింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపాడు. అలాగే టీచర్ల నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పాడు. తన తల్లి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) సూపర్వైజర్ పరీక్షను లక్ష్యంగా చేసుకుందని, ఆ ప్రయత్నాలు ఎల్జీఎస్ పరీక్షలో ఉత్తీర్ణతకు సహాయపడ్డాయని తెలిపాడు. పాస్ అవుతామని తాము అనుకోలేదని, అయితే ఇద్దరం ఉత్తీర్ణత సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.
మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అయిన తల్లీ, కుమారుడి గురించి తెలుసుకున్న నెటిజన్లు వారిని అభినందించారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారంటూ ప్రశంసించారు. ఇలాంటి వార్తలు నిజమైన ప్రేరణ అని ఒకరు పేర్కొన్నారు. వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమేనని, విద్య లేదా ఉన్నత చదువులు అభ్యసించడానికి అడ్డంకి కాదని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా, చిన్న వయసులో పెళ్లై, 18వ ఏట తల్లి అయిన ఆమె, తన కుమారుడితో కలిసి కోచింగ్కు వెళ్లి పీఎస్సీ పరీక్షను క్లియర్ చేయడం లక్ష్యసాధనకు నిజమైన ఉదాహరణ అని ఒకరు అభివర్ణించారు.