హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ‘ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం మనది. దీనిని సద్వినియోగం చేసుకుంటే అగ్రగామి దేశంగా మారగలుగుతాం. యూపీఏ ప్రభుత్వం ఆ పనిచేయలేకపోయింది. మేం చేసి చూపిస్తాం’-2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ మాయమాటలను నమ్మి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే యువతకు ఉపాధి మాట దేవుడెరుగు.. కనీసం పోషకాహారం కూడా తినలేని స్థితికి దిగజార్చారు. మోదీ ప్రభుత్వం ఎనిమిందేండ్ల పాలనలో సత్తువ కలిగిన యువతతో నిండిన భారత దేశాన్ని ‘నిస్సత్తువ భారత్’గా మార్చింది. ఓవైపు నిత్యావసరాల ధరలు, ఖర్చులు పెరిగిపోతుంటే.. మరోవైపు ప్రజల ఆదాయం పడిపోతున్నది. ఫలితంగా కనీస పోషకాహారం కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొన్నది.
ప్రజలు పోషకాహారానికి దూరం కావడానికి కారణాలు ఇదే
నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం: మోదీ పాలనలో దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదల విపరీతంగా ఉన్నది. ప్రపంచ సగటుతో పోల్చితే గత ఎనిమిదేండ్లలో ఇది ఏటా కనీసం మూడు రెట్లు అధికంగానే ఉంటున్నది. దీంతో పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ప్రజల ఆదాయం ఆశించినంత పెరుగకపోవడం: గత ఎనిమిదేండ్లలో తలసరి ఆదాయం ఆశించినంతగా పెరుగలేదు. 2014-15లో తలసరి ఆదాయం రూ.86,647 ఉండగా.. 2021 నాటికి రూ.1.28 లక్షలకు మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. 2020-2021 మధ్య పోల్చినప్పుడు నిత్యావసరాల ధరలు 84 శాతం పెరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఇదే సమయంలో తలసరి ఆదాయం రూ.1.34 లక్షల నుంచి రూ.1.28 లక్షలకు పడిపోయింది. అంటే.. ఆదాయం తగ్గింది, ధరలు పెరిగాయి.
ఏటా 10 కోట్ల మంది దూరం..
‘పోషహాకారం కొనుగోలుకు అయ్యే ఖర్చు ఒక మనిషి సంపాదనలో 63 శాతం దాటితే దానిని ‘భరించలేని స్థితి’(అన్ అఫర్డబుల్)గా పేర్కొనవచ్చు’
– ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ విభాగం
రోగాల పుట్ట
పోషకాహార లోపం మనిషిని బలహీనం చేయడమే కాదు.. అనేక వ్యాధులకు కారణం అవుతున్నాయి. శ్వాస కోశ, మధుమేహం, క్యాన్సర్, హృద్రోగాలు వస్తున్నాయి. ఇప్పటికే మన దేశం డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులకు కేంద్రంగా మారింది.