న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నదని కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. అయితే కేసుల సరళిని పరిశీలిస్తూనే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. 400 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలిపారు. 11 రాష్ర్టాల్లో 50 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలోనే 3 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. దేశంలో 18 ఏండ్లు పైబడిన 95 శాతం మంది తొలిడోసు, 74 శాతం మంది రెండు డోసులు వేసుకొన్నట్టు వెల్లడించారు. 15-18 ఏండ్ల మధ్య వయస్కుల్లో 59 శాతం మందికి తొలి డోసు పూర్తయినట్టు వివరించారు. ఒమిక్రాన్ సబ్వేరియంట్ బీఏ.2 ప్రాబల్యం ఇప్పుడు దేశంలో అధికంగా ఉన్నదని తెలిపారు. దేశంలో బూస్టర్ డోసు విషయంలో ప్రపంచ దేశాలను గుడ్డిగా అనుసరించబోమని కేంద్రం పేర్కొన్నది.
24 గంటల్లో 2.86 లక్షల కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో (బుధవారం నుంచి గురువారం నాటికి) 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500కి చేరింది. వీరిలో 3,76,77,328 మంది కోలుకున్నారు. 22,02,472 మంది చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో వ్యాధిబారిన పడినవారిలో తాజాగా 573 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,91,700కి పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 19.59గా కొనసాగుతున్నది.
వచ్చేనెల 28 వరకు కరోనా నియంత్రణ చర్యలు
దేశంలో అమల్లో ఉన్న కరోనా నియంత్రణ చర్యలను కేంద్రం మరోసారి పొడిగించింది. వచ్చే నెల 28 వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే నియంత్రణ చర్యలను పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.
దశలవారీగా బడుల్లో తరగతులు!
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, వేరువేరు సమయాల్లో తరగతులను నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులు ఎన్నటికీ తరగతి గది బోధనకు సాటిరావని తల్లిదండ్రులు భావిస్తున్న దృష్ట్యా ప్రత్యామ్నాయాల కోసం కేంద్రం అన్వేషిస్తున్నది. ఒమిక్రాన్ రకం కరోనా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా మళ్లీ బడులను మూసేశారు. గత రెండేండ్లుగా విద్యార్థులు చాలావరకు ఆన్లైన్ క్లాసులకే హాజరవుతున్నారు. ‘విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో దశలవారీగా తరగతులు అనుమతించే పద్ధతిపై సర్కారు కసరత్తు చేస్తున్నది’ అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. బుధవారం తల్లిదండ్రుల ప్రతినిధివర్గం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కలిసి బడులు తెరవాలని విజ్ఞాపన పత్రం సమర్పించింది. దానిపై 1600 మంది సంతకాలు చేశారు. ఇక కొందరు తల్లిదండ్రులేమో ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం కన్నా ఆన్లైన్ తరగతులే ఉత్తమమంటున్నారు. పిల్లల సామాజిక, మానసిక స్థితి మరింతగా దిగజారకుండా చర్యలు చేపట్టాల్సి ఉందని సిసోడియా వ్యాఖ్యానించారు. ఢిల్లీ పరిధిలోని స్కూళ్లను తిరిగి తెరవాలని ఆప్ ప్రభుత్వం సిపారసు చేసింది. ఉత్పాతాల నివారణ విభాగం ప్రస్తుతం దీనిపై కసరత్తు చేస్తున్నది.