ఇంఫాల్, మే 28: రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న మణిపూర్లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ చుట్టు పక్కల ఏక కాలంలో జరిగిన పలు ఎన్కౌంటర్లలో దాదాపు 40 మంది మిలిటెంట్లను మట్టుబెట్టామని ఆ రాష్ట్ర సీఎం బీరెన్సింగ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు పౌరులు చనిపోగా, మరో 12 మందికి గాయాలయ్యాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ తరుణంలో మణిపూర్లో మళ్లీ హింస చెలరేగటం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజుల క్రితం శాంతిభద్రతలపై సమీక్ష చేసి వెళ్లిపోయారు. పరిస్థితి మెరుగుపడిందని భావిస్తున్న సమయంలో ఆదివారం పలు ఎన్కౌంటర్లు జరగటం సంచలనం రేపింది.