కొవిడ్ పరికరాలు, ఔషధాలకు పన్ను మినహాయింపుపై అధ్యయనం
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణకు ఉపకరించే పరికరాలు, ఔషధాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో మినహాయింపు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో అధ్యయన బృందాన్ని నియమించింది. ఈ బృందంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు చోటు దక్కింది. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందంలో హరీశ్రావు సహా ఎనిమిది మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. కరోనా నియంత్రణలో సహాయపడే టీకాలు, ఔషధాలు, పరికరాలు, కొవిడ్ టెస్ట్ కిట్ల లాంటి వాటికి జీఎస్టీ మినహాయింపులివ్వడంపై ఈ బృందం సిఫారసు చేయనున్నది. జూన్ 8న నివేదికను సమర్పించనున్నది. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశంలో జీఎస్టీ మినహాయింపుపై చర్చించినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అధ్యయనానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.