Lok Sabha security breach | న్యూఢిల్లీ : పార్లమెంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు లోక్సభలో కలర్ స్మోక్ వదిలి నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నాలుగు అంచెల భద్రతా వలయాన్ని దాటుకొని ఆగంతకులు లోక్సభ విజిటర్స్ గ్యాలరీలోకి ఎలా ప్రవేశించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిణామాలతో పార్లమెంట్ భద్రతా వ్యవస్థపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పార్లమెంట్ వద్ద ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది..? ఎవరెవర్ని అనుమతిస్తారు..? అనే విషయాలను తెలుసుకుందాం.
2001లో పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగిన సమయానికి మూడు అంచెల భద్రత వ్యవస్థ ఉండేది. ఆ దాడి తర్వాత భద్రతను నాలుగు అంచెలకు పెంచారు. బందోబస్తులో భాగంగా ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ యూనిట్ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలతో పాటు ఫైర్ సర్వీస్ సిబ్బంది విధుల్లో నిమగ్నమై ఉంటారు. తనిఖీల్లో భాగంగా పార్లమెంట్ ప్రవేశ ద్వారం నుంచి విజిటర్స్ గ్యాలరీ వరకు మూడుసార్లు ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆయా వ్యక్తుల ఫోన్లు, బ్యాగులు, పెన్నులు, వాటర్ బాటిల్స్తో పాటు నాణేలను కూడా నిశితంగా పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఫుల్ బాడీ స్కానర్లతో మూడు చోట్ల స్కాన్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత విజిటర్స్ పాస్ను అలాట్ చేస్తారు.
ప్రస్తుతం ఎంపీలు, సరైన గుర్తింపు కార్డు కలిగిన అధికారులు, జర్నలిస్టులు, టెక్నీషియన్లు, ఫ్యూన్లు మినహా పార్లమెంట్లోకి అడుగు పెట్టేందుకు ఎవరికి అనుమతి లేదు. అయితే ఎంపీలు ఎవరికైతే సిఫారసు లేఖలు జారీ చేస్తారో వారినే ప్రత్యేకంగా తనిఖీ చేసి అనుమతిస్తారు. సిఫారసు లేఖలు పొందిన సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత.. వారి నుంచి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే వారికి లోక్సభ విజిటర్స్ గ్యాలరీ పాస్లు జారీ చేస్తారు. కానీ ఇవాళ లోక్సభలోకి చొరబడ్డ ఆ ఆగంతకులు ఇద్దరు.. ఫుల్ బాడీ స్కానర్లను దాటుకుని, లోపలికి ఎలా వెళ్లారనేది ప్రశ్నార్థకంగా మారింది. వారు ధరించిన షూలో కలర్ స్మోక్ను దాచి వెళ్లడం చర్చానీయాంశంగా మారింది.