శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి. షోపియాన్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందినవారు కాగా, పుల్వామాలో హతమైన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదు. షోపియాన్లోని బ్రరిపోరాలో నివసిస్తున్న సజాద్ అహ్మద్ చాక్, పుల్వామాలోని అచాన్ లిట్టర్కు చెందిన రాజా బాసిత్ యాకూబ్, లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు.
వీరిద్దరికి అనేక ఉగ్రవాదుల కేసుతో సంబంధాలున్నాయని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. యువకులను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంలో, రిక్రూట్ చేయడంలో చాక్ కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ఈ ఇద్దరు ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే సిరీస్ రైఫిళ్లు, నాలుగు ఏకే మ్యాగజైన్లు, 32 రౌండ్లతో సహా పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని హర్దుమీర్లో శనివారం రెండో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. వారి గుర్తింపుతోపాటు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఒక పోలీసు, పౌరులు, ఇతర హత్యలకు పాల్పడిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని భద్రతా దళాలు శుక్రవారం అనంతనాగ్ జిల్లాలో మట్టుబెట్టాయి.