న్యూఢిల్లీ, నవంబర్ 15: అవయవదానంలో మహిళలు తమ కుటుంబ సభ్యుల పట్ల అంతులేని ఔదార్యం చూపుతున్నారు. భర్త, తల్లిదండ్రులు, తమ పిల్లలకు అవయవదానం చేయటానికి వెనుకాడటం లేదు. అయితే ఇదే విధమైన స్పందన మహిళల విషయంలో కుటుంబంలోని ఇతర సభ్యుల నుంచి ఉండటం లేదని, మనదేశంలో అవయవదానంలో లింగ అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘నేషనల్ ఆర్గాన్, టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్’ (ఎన్వోటీటీవో) గణాంకాల్ని ఉటంకిస్తూ, అవయవదానం చేస్తున్న వారిలో 80శాతం మంది మహిళలుంటే, గ్రహీతల్లో 80శాతం పురుషులున్నారని పేర్కొన్నది. మనదేశంలో 1995 నుంచి 2021 వరకు మొత్తం 36,640 అవయవ మార్పిడి ఆపరేషన్లు జరగ్గా, ఇందులో 29,000 మంది గ్రహీతలు పురుషులు కాగా, మహిళలు 6,945 మంది మాత్రమే ఉన్నారు. సగటున 5 శస్త్ర చికిత్సల్లో ఒక్కదాంట్లో మాత్రమే మహిళ గ్రహీతగా ఉన్నారని నిపుణులు తెలిపారు. మహిళలపై సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రభావం, శస్త్ర చికిత్సలంటే వారిలో నెలకొన్న భయం.. లింగ అసమానతలకు దారితీసిందని నిపుణులు అభిప్రాయపడ్దారు.