న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. ప్రతి ఏటా దీపావళి పటాసులవల్ల కూడా వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రతపై ఓ సోషల్ మీడియా సంస్థ అధ్యయనం చేసింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలపై కాలుష్యం ప్రభావం పడిందని తెలిపింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలవాళ్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించింది.
సర్వే సంస్థ ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్లలో మొత్తం 34,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. 16 శాతం మంది గొంతు సమస్య లేదా దగ్గు లేదా రెండింటితో బాధపడుతున్నారు. మరో 16 శాతం మంది ముక్కు కారడం, కండ్ల మంట సమస్యతో సతమతమవుతున్నారు. ఇంకో 16 శాతం మంది తాము శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నామని చెప్పారు.
కేవలం 20 శాతం మంది మాత్రమే తమపై కాలుష్యం ప్రభావం లేదని తెలిపారు. ఇంకో 24 శాతం మంది పైన పేర్కొన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరో 8 శాతం మంది కనీసం రెండు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేవలం 28 శాతం మంది మాత్రమే ఎయిర్ ప్యూరిఫయర్స్ ఉపయోగించాలనుకుంటున్నారని, 61 శాతం మంది ప్రస్తుతం పరిస్థితిని తట్టుకునేందుకు యాంటీ పొల్యూషన్ మాస్కులను వినిగియోగిస్తున్నారని సర్వే సంస్థ తెలిపింది.