డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఛార్ధామ్ యాత్ర(Char Dham Yatra) మొదలై 26 రోజులు అవుతోంది. అయితే ఇప్పటికే ఆ యాత్రకు బయలుదేరిన భక్తుల్లో 38 మంది మృతిచెందినట్లు తెలిసింది. వివిధ రకాల ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆ మరణాలు సంభవించాయని ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు. ఏప్రిల్ 19వ తేదీన ఛార్ధామ్ యాత్ర మొదలైంది. ఆ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 22, 23 తేదీల్లో కేదార్నాథ్, బద్రీనాథ్ టెంపుల్స్ తెరిచారు.
కేవలం కేదార్నాథ్లోనే అత్యధికంగా 21 మంది ప్రాణాలు విడిచినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తన నివేదికలో పేర్కొన్నది. ఇక బద్రీనాథ్లో ఏడు మంది మరణించినట్లు తెలిసింది. గంగోత్రి, యమునోత్రిలో అయిదేసి మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటు, ఆల్టిట్యూడ్ సిక్నెస్తో పాటు అనేక కారణాల వల్ల మృతిచెందారు. బుధవారం సాయంత్రం వరకు సుమారు 11.81 లక్షల మంది యాత్రికులు ఛార్ధామ్ ఆలయాలను సందర్శించారు.
కేదార్నాథ్ను అత్యధికంగా 4.91 లక్షల మంది భక్తులు విజిట్ చేశారు. ఇక బద్రీనాథ్ ఆలయాన్ని 3.02 లక్షల మంది చేరుకున్నారు. యమునోత్రికి 1.94 లక్షల మంది, గంగోత్రికి 1.92 లక్షల మంది విజిటర్స్ వచ్చారు. ఛార్ధామ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ల సంఖ్య 33.96 లక్షలు దాటింది. కేదార్నాథ్ కోసం సుమారు 11.68 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.