బెంగళూరు : కొంతమంది యువకులు కోతులకు విషమిచ్చి అత్యంత దారుణంగా చంపేశారు. ఈ ఘోరమైన ఘటన కర్ణాటక జిల్లాలోని హసన్ జిల్లాలో వెలుగు చూసింది. చౌడనహల్లి గ్రామ సమీపంలో గోనె సంచుల్లో కోతులను కుక్కి గుర్తు తెలియని దుండగులు వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గోనె సంచులను తెరిచి చూడగా.. 38 కోతులు చనిపోయి ఉన్నాయి. ఆ కోతులకు తీవ్రంగా చితకబాదినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. మరో 20 కోతులు తీవ్ర గాయాలతో బాధపడుతూ కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. గాయపడిన కోతులకు స్థానికులు నీళ్లు అందించారు.
అనంతరం పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చౌడనహల్లికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన కోతులను స్వాధీనం చేసుకున్నారు. కోతులకు విషమిచ్చి.. దారుణంగా కొట్టి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. కొన్ని కోతులైతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.